పారిశుధ్య కార్మికులకు చెత్త సేకరణ కొరకు 290 ట్రై సైకిళ్లు పంపిణీ.
డాక్టర్..బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా….
అమలాపురం కలెక్టరేట్ : పరిశుభ్రమైన సమాజం నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ప్రాంగణం నందు స్వచ్ఛఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర – స్వచ్ఛఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి తడి-పొడి మరియు హానికరమైన వ్యర్థాల సేకరణ కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ట్రై సైకిళ్ల పంపిణీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ జెండా ఊపి ట్రై సైకిళ్లను ప్రారంభించి, పారిశుధ్య కార్మికులకు అందజేశారు.
జిల్లాకు 290 ట్రై సైకిళ్లు చెత్త సేకరణ కొరకు సరఫరా కాబడ్డాయన్నారు. పంపిణీ చేసిన ట్రై సైకిళ్లతో ఇకపై ప్రతి గడప నుంచి పక్కాగా వ్యర్థాల సేకరణ జరుగుతుందన్నారు. చెత్త సేకరణలో వినూత్న మార్పులు గతంలో మాదిరిగా కాకుండా వ్యర్థాల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తున్నామని తెలిపారు. కేవలం తడి, పొడి, హానికర వ్యర్థాల చెత్తను సేకరించడమే కాకుండా దానిని మూలాల్లోనే వేరు చేయడం చాలా ముఖ్యమన్నారు. అందుకోసమే ఈ ప్రత్యేక ట్రై సైకిళ్లను రూపొందించారని ఆయన పేర్కొన్నారు. తడి పొడి హానికర వ్యర్ధాలు అయినటువంటి మూడు రకాల వ్యర్థాల సేకరణకు ఆరు ప్లాస్టిక్ డ్రమ్ములను ఒక్కొక్కరకమైన చెత్త సేకరణకు రెండు చొప్పున ట్రై సైకిల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ట్రై సైకిళ్ల ద్వారా సేకరణను మూడు రకాలుగా విభజించినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు.
తడివ్యర్ధాలైన వంటగది వ్యర్థాలు, పండ్లు, కూరగాయల తొక్కలు ఉంటాయన్నారు. పొడి వ్యర్థాలుగా ప్లాస్టిక్, కాగితం, గాజు ముక్కలు, లోహాలు, హానికర మైన వ్యర్ధాలైన శానిటరీ నాప్కిన్లు, డయాపర్లు, బ్లేడ్లు, బ్యాటరీలు వంటివి ఉంటాయన్నారు. పట్టణాలు మరియు గ్రామాల ఆరోగ్యం పారిశుధ్య కార్మికుల చేతుల్లోనే ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు చేసే సేవ వెలకట్టలేనిదన్నారు.
ఈ ట్రై సైకిళ్లు కార్మికుల పనిని సులభతరం చేయడమే కాకుండా, వ్యర్థాల రవాణాను మరింత సులభతరం చేస్తాయన్నారు.ప్రజలు తమ ఇళ్ల వద్దే తడి, పొడి చెత్తను వేరు చేసి కార్మికులకు వేరు వేరుగా అందించాలన్నారు. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యం నెరవేరాలంటే ప్రజల సహకారం అనివార్యమని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శాంత లక్ష్మీ, పంచాయతీల అధికారులు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ప్రతినిధులు ఇతర అధికారులు పాల్గొన్నారు.
