ఎల్నీనో ప్రభావానికి ముందస్తు చర్యలు…
అంపురంలో పీఎండీఎస్ విత్తన కిట్ల తయారీ
శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం
వాతావరణ మార్పుల్లో భాగంగా ఎల్నీనో ప్రభావం ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని అంపురం గ్రామంలో రైతులకు పీఎండీఎస్ విధానంపై అవగాహన కల్పిస్తూ విత్తన కిట్లను తయారు చేశారు. ఈ కార్యక్రమంలో 10 జాతులకు చెందిన 30 రకాల విత్తనాలను సమీకరించి, ఒక్కో కిట్ను సుమారు 15 కిలోల బరువుతో సిద్ధం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా మండలాంకర్ శివానందం మాట్లాడుతూ పీఎండీఎస్ విధానం ద్వారా రసాయన ఎరువులైన యూరియా, డీఏపీ వినియోగం తగ్గుతుందని తెలిపారు. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల భూసారం పెరగడం, భూమిలో తేమ శాతం మెరుగుపడడం, జీవ వైవిధ్యం అభివృద్ధి చెందడం వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వివరించారు. ముఖ్యంగా తొలకరి వర్షాలకు ముందుగానే ఈ విత్తనాలను వేయడం ద్వారా భూమిలో తేమ నిల్వ పెరిగి పంటల ఉత్పాదకతకు దోహదం చేస్తుందని చెప్పారు.
పీఎండీఎస్ విధానం రైతులకు తక్కువ ఖర్చుతో అధిక లాభాలు అందించే అవకాశం కల్పిస్తుందని, ప్రకృతి అనుకూల వ్యవసాయానికి ఇది బలమైన మార్గమని సూచించారు. రైతులు ఈ విధానాన్ని విస్తృతంగా అవలంబించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్సీ వానర్ మద్ది మోహిని, వీఓఏ మద్ది వరలక్ష్మి, అంపురం యూనిట్ ఐసీఆర్పీలు, ట్రైనీ ఐసీఆర్పీలు, లీడ్ ఫార్మర్లు మరియు గ్రామానికి చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు.
