PALASA: పలాస శాసన సభ్యులు శ్రీమతి గౌతు శిరీష ఈరోజు పలాస నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు.
నియోజకవర్గంలోని వివిధ గ్రామాలు, పట్టణ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమె ప్రతి వినతిని ఓర్పుతో ఆలకించి సంబంధిత అధికారులతో చర్చించి తక్షణ పరిష్కారానికి తగిన ఆదేశాలు జారీ చేశారు.
ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత చేరువ కావడంతో పాటు, సమస్యల పరిష్కారంలో వేగం పెరగాలని ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా తీసుకొని ప్రతి సమస్యను బాధ్యతగా పరిష్కరించే దిశగా ఆమె నిరంతరం కృషి చేస్తున్నారు.

పలాస నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం మరియు ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా పనిచేయడం తన ప్రధాన లక్ష్యమని, ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు.
ఈరోజు వచ్చిన వినతులలో ముఖ్యంగా పెన్షన్, రోడ్లు భూ సమస్యలు,ఉద్యోగ సమస్యలు మరియు ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాల అభివృద్ధి కొరకు 27 వినతులు రావడం జరిగింది. వీటన్నింటిని సంబంధిత శాఖ అధికారులకు పంపించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని ఆదేశించడం జరిగింది.
