పలాస పిఏసీఎస్ లో గత 2005 నుండి 2024 ఆర్ధిక సంవత్సరాల మధ్య కాలంలో పెద్దఎత్తున ఆర్ధిక అవినీతి జరిగిందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆరోపించారు.
శ్రీకాకుళం జిల్లా పలాస లోగల టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గౌతు శిరీష మాట్లాడుతూ…
పిఏసీఎస్ సభ్యుల అనుమతి లేకుండా కొంతమంది పేర్లతో లక్షల రూపాయల రుణాలు వాడుకున్నట్లు ఆమె దృష్టికి వచ్చిందన్నారు. సంఘంలో లేని బయట వ్యక్తుల బినామీ పేర్లతో భూమి పత్రాలు, సరైన డాక్యుమెంట్లు లేకుండానే రుణాలు మంజూరు చేసినట్లు తెలిసిందని ఆమె తెలిపారు.
పలాస పిఏసీఎస్ నూతన భవన నిర్మాణానికి 1.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినప్పటికీ, అధికారుల అనుమతి లేకుండా అదనంగా 35 లక్షల రూపాయలు సంబంధిత కాంట్రాక్టర్ కు చెల్లించినట్లు ఉందని, అయితే ఆ 35 లక్షల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయో తెలియాల్సిఉందన్నారు.
అన్నీ కలుపుకుని పలాస పిఏసీఎస్ లో సుమారు 5 కోట్ల 50 లక్షల రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరినట్లు తెలిపిన ఎమ్మెల్యే గౌతు శిరీష, అవినీతికి పాల్పడ్డవారందరి పేర్లను తీస్తా, అందరి లెక్కలు తేలుస్తానన్నారు.
