బస్ ఫుల్…మెయింటెనెన్స్ నిల్ అన్నట్టుంది శ్రీకాకుళం జిల్లా పలాస ఆర్టీసీ డిపోకు చెందిన బస్సుల పరిస్థితి.
ఓవైపు ఫ్రీ బస్ పథకంతో ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులతో కిటకిటలాడుతుంటే మరో వైపు బస్సులు సరైన మెయింటెనెన్స్ లేక పలు బస్సులు గమ్యస్థానాలకు చేరేలోపు మధ్యలోనే రోడ్లపై మొరాయిస్తున్నాయి.
గమ్యస్థానాలకు చేరకుండానే మార్గమధ్యంలో బస్సులు పలు సాంకేతిక లోపాలతో మొరాయిస్తుండడంతో ప్రయాణీకులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
మూడు రోజుల క్రితం రెండు ఆర్టీసీ బస్సులు జాతీయరహదారి పై సాంకేతికలోపాలతో మొరాయించగా,ఈరోజు ఉదయం పలాస ఆర్టీసీ డిపో వద్ద విశాఖపట్నం వెళ్లాల్సిన ఓ బస్సు మొరాయించడంతో స్థానికులు చెమటోడ్చి బస్సును నెట్టడంతో ముందుకు సాగగా ప్రయాణీకులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇప్పటికైనా పాలకపక్షంతోపాటు ఆర్టీసీ యాజమాన్యం దృష్టి సారించి కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని పలువురు కోరుతున్నారు.
