జిల్లా క్రికెట్ అసోసియేషన్లో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం.
జాయింట్ సెక్రటరీగా ఎన్జీ బెనర్జీ
ఈసీ మెంబర్లుగా వజ్జ ప్రవీణ్ సాగర్, అలీమ్ ఖాన్
ICHAPURAM : శ్రీకాకుళం జిల్లా క్రికెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గంలో ఇచ్ఛాపురం నియోజకవర్గానికి విశేష ప్రాధాన్యం దక్కింది. నియోజకవర్గానికి చెందిన ముగ్గురు యువ క్రీడా ప్రతినిధులు కీలక పదవులు పొందడంతో స్థానిక క్రీడా వర్గాల్లో ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. సోంపేటకు చెందిన ఎన్జీ బెనర్జీని జిల్లా క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నియమించగా, కంచిలి మండలం మకరాంపురం గ్రామానికి చెందిన వజ్జ ప్రవీణ్ సాగర్, ఇచ్ఛాపురానికి చెందిన అలీమ్ ఖాన్ ను ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా ఎంపిక చేశారు. యువతకు ప్రాధాన్యం ఇస్తూ ఈ నియామకాలు చేపట్టడం విశేషంగా మారింది. బాధ్యతలు స్వీకరించిన అనంతరం వీరు మాట్లాడుతూ, జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణతో ముందుకు సాగుతామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి వారికి శిక్షణ, ప్రోత్సాహం, అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామన్నారు. మండల, జిల్లా స్థాయిల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించి ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. యువతలో క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టు భావన పెంపొందించడమే తమ లక్ష్యమని చెప్పారు. తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షులు, రాష్ట్ర పీయూసీ చైర్మన్, ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, వైస్ ప్రెసిడెంట్ తర్లాడ బాలమురళీకృష్ణ, కార్యదర్శి షేక్ హసన్ రాజా, కార్యవర్గ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో జిల్లాలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం లభించి గ్రామీణ యువతకు మెరుగైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయని క్రీడాభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
