ఎంపీ నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం
కొల్లూరు, డీజీపురంలో మండపాల శంకుస్థాపన.
బైరిపురంలో హోమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ అశోక్ బాబు.
కంచిలి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం అవుతున్నాయి. ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబు బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎంపీ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
మొదటగా కొల్లూరు గ్రామపంచాయతీలో ఎంపీ నిధులతో నిర్మించనున్న మండపానికి శంకుస్థాపన చేసిన ఆయన, అనంతరం డీజీపురం గ్రామపంచాయతీలో కూడా ఎంపీ నిధులతో చేపట్టనున్న మండప నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ మండపాలు గ్రామాల్లో సామాజిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఉపయోగపడనున్నాయని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను చేపడుతూ గ్రామాల సమగ్రాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
