చిన్న కొజరియలో విత్తనగులికలపై రైతులకు అవగాహన.
తక్కువ వర్షానికైనా మొలకెత్తే విత్తనగులికలు తయారీ ప్రదర్శన.
ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఐసీఆర్పీల ఆధ్వర్యంలో కార్యక్రమం.
KANCHILI : కంచిలి మండలం చిన్న కొజరియాలో శుక్రవారం రైతుల సమక్షంలో విత్తనగులికలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతుల వద్దనే విత్తనగులికలు తయారు చేసి చూపించారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విత్తనగులికల ప్రయోజనాలను వివరించారు.
విత్తనగులికలతో అధిక మొలకశాతం-చీడపీడల నుంచి విత్తనాలకు రక్షణ:

ఈ విధంగా విత్తనగులికలు చేసి వేయడం వల్ల సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం పడినా విత్తనాలు మొలకెత్తుతాయని సిబ్బంది తెలిపారు. ఎలాంటి ఎండ టైంలో వేసినా విత్తనం పాడవకుండా భూమిలో ఎటువంటి నష్టం కలగకుండా నిక్షేపంగా ఉంటుందని, వర్షాలు పడినప్పుడు మొలకశాతం బాగా వస్తుందని వివరించారు. చీడపీడల నుంచి విత్తనాలను కాపాడటంతో పాటు భూమిలో సూక్ష్మజీవులు ఎండబారిన పడకుండా కాపాడుతుందని తెలిపారు.
తక్కువ వర్షానికైనా రైతుకు ఆదాయం-భూమిలో జీవవైవిధ్యం పెరుగుతుందని వెల్లడి:
తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ ఏదో ఒక పంట ద్వారా రైతుకు ఆదాయం వస్తుందని, భూమి నిరంతరం పచ్చని పంటలతో కప్పి ఉంటుందని సిబ్బంది పేర్కొన్నారు. దీనివల్ల భూమిలో తేమశాతం నిలిచి ఉండి, జీవవైవిధ్యం పెరుగుతుందని రైతులకు అవగాహన కల్పించారు. గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విత్తనగులికల తయారీని ఆసక్తిగా గమనించారు. ఈ కార్యక్రమంలో అంపురం యూనిట్ ఐసీఆర్పీలు బొడ్డ పుష్ప, మీనా, రంజిత, జ్యోతి, రేవతి, హేమలతతో పాటు లీడ్ ఫార్మర్స్ జీ గౌతమి, జీ వినీత పాల్గొన్నారు.
