MANDASA : మంగళ పాత్రో కుమారుడి మృతి అత్యంత బాధాకరం: మృతుని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి గౌతు శివాజీ.
పలాస నియోజకవర్గం, మందస మండలం, కొంకడాపుట్టి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు, యూనిట్ కో-ఇంచార్జ్ మంగళ పాత్రో గారి కుమారుడు (అంకిత్ పాత్రో) హైదరాబాద్లో ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. పైచదువుల కోసం హైదరాబాద్ వెళ్లిన సదరు విద్యార్థి, అక్కడ స్నేహితులతో కలిసి స్నానానికి చెరువులోకి దిగి ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.
ఈ చేదు నిజం తెలుసుకున్న పలాస నియోజకవర్గ అగ్రనేత, మాజీ మంత్రివర్యులు శ్రీ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు కొంకడాపుట్టిలోని మంగళ పాత్రో గారి నివాసానికి స్వయంగా వెళ్లారు. మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, పుత్రశోకంలో ఉన్న మంగళ పాత్రోను, ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. “ఉన్నత చదువులు చదివి ప్రయోజకుడు అవుతాడనుకున్న కుమారుడు ఇలా అనంత లోకాలకు వెళ్లడం ఆ కుటుంబానికి కోలుకోలేని దెబ్బ” అని శివాజీ గారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళ పాత్రో కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
మాజీ మంత్రి శివాజీ గారితో పాటు మంగళ పాత్రో కుటుంబాన్ని పరామర్శించిన వారిలో మందస మండల అధ్యక్షులు బావన దుర్యోధన గారు, మండల కార్యదర్శి సాలీనా మాధవ రావు గారు, చంద్ర శేఖర్ ముంజేటి, తిరుపతి డుంకూర, నవీన్ యాదవ్, మహేశ్ రాజానా, మడ్డు కుమార్ తదితర ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వీరంతా మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ, కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
