తప్పు చేయని వారికి ఫ్రెండ్లీ పోలీస్ – తప్పుచేసేవారికి ఎనిమీ పోలీస్ : సీఐ సురేష్ బాబు.
రాజోలు నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా, వి.సురేష్ బాబు ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇంటిలిజెన్స్ సీ.ఐ., గా పనిచేస్తున్న ఈయన బదిలీపై రాజోలు వచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన టి.వి.నరేష్ కుమార్ జిల్లా ఇంటిలిజెన్స్ సీ.ఐ., గా బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, పేకాట, జూదం మరియు అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరిస్తానన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వచ్చి తనను కలవచ్చన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తప్పవన్నారు. జాయ్ రైడింగ్, బైక్ రైడింగ్ లతో ప్రజలకు ఇబ్బంది కలిగించినా, రోడ్డు ప్రమాదాలకు కారకులైన వారిని ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని గుర్తెరగాలన్నారు. ఈ సందర్భంగా పలువురు సిబ్బంది ఆయనకు పుష్ప గుచ్చాలు అందించి అభినందనలు తెలిపారు.
