వితంతువులకు భరోసా.. జూన్ 12 నుంచి కొత్త పింఛన్లు – రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.
NIMMADA : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా, జూన్ 12న అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలోని క్యాంప్ కార్యాలయంలో ‘ప్రజాదర్బార్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నియోజకవర్గ పరిధిలో సంతబొమ్మాళి మండలం ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించిన మంత్రి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ‘ఎన్టీఆర్ భరోసా’ కింద వితంతువులకు నెలకు రూ. 4,000 అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే అర్హత ఉన్నవారు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
ప్రతి ఒక్కరి విన్నపాన్ని సావధానంగా విన్న అనంతరం, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు మరియు సేవలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు ప్రజలకు భరోసా కల్పించారు.
రైతులకు ప్రభుత్వం సబ్సీడిపై వ్యవసాయ యాంత్రీకరణ పరికారాలు అందిస్తోందని, ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సాగునీటి సమస్యను పరిష్కరించాలని రైతులు వినత పత్రం ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లిఫ్ట్ ఇరిగేషన్లు ఐదేళ్లు పట్టించుకోలేదని విమర్శించారు. త్వరలో వాటన్నింటినీ పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
