నవధాన్యాల బాటలో రైతాంగం.
గ్రామసభల ద్వారా ప్రకృతి వ్యవసాయంపై అవగాహన.
సోంపేట డివిజన్ పరిధిలోని కంచిలి మండలం, బురదపాడు, కర్తలి, సిర్తలి గ్రామాల్లో రైతులకు నవధాన్యాల సాగుపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో భూసార పరిరక్షణ, ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు.
ఫీల్డ్ మాస్టర్ ట్రైనర్ శివానందం మాట్లాడుతూ, నవధాన్యాల సాగు వల్ల భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెందడంతో పాటు తేమశాతం పెరిగి, భూసారం మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే జీవవైవిధ్యం పెరిగి పంటల దిగుబడులు మెరుగుపడటానికి ఇది దోహదపడుతుందని రైతులకు వివరించారు.
పీఏసీఎస్ చైర్మన్ పైల పురుషోత్తంరెడ్డి, వాసాల రమేష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో, రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రకృతి అనుకూల వ్యవసాయ పద్ధతులు పాటిస్తే మంచి ఆహారం, మంచి ఆరోగ్యం లభించడంతో పాటు రైతులకు ఆదాయం కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, లీడ్ ఫార్మర్స్, అంపూరం యూనిట్ ఐసీఆర్టీలు, ట్రైనీ ఐసీఆర్పీలు పాల్గొన్నారు.
