ఉద్దాన నేలతల్లికి ‘మువ్వల సవ్వడి’ – వజ్రపుకొత్తూరు మండలంలో బీడు రోడ్డుకు మహర్దశ!
డబుల్ తారు రోడ్డుతో మారిన ఉద్దానం ముఖచిత్రం.
పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సంకల్పానికి సర్వత్రా ప్రశంసలు.
‘మా ప్రాణాలకు, ఆటోలకు రక్షణ దొరికింది’ – ఆటో కార్మికుల ఆనందహేల.
Vajrapukotturu : ఉద్దాన ప్రాంత ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. వజ్రపుకొత్తూరు మండలంలో గుంతలమయంగా మారిన రహదారికి కూటమి ప్రభుత్వ హయాంలో మోక్షం లభించింది. తాళబద్ర మీదుగా గరుడుభద్ర, అక్కుపల్లి, బైపల్లి, బాతుపురం, చినవంక, డోకులపాడు మీదుగా వజ్రపుకొత్తూరు వరకు నిర్మించిన సరికొత్త డబుల్ తారు రోడ్డు (Double Tar Road) ఇప్పుడు ఉద్దాన నేలతల్లికి మువ్వల సవ్వడిలా మెరిసిపోతోంది. పలాస శాసనసభ్యులు గౌతు శిరీష ప్రత్యేక సంకల్పంతో ఈ రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయించడంతో స్థానిక ప్రజలు, ముఖ్యంగా ఆటో కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
ఆనాడు నరకం.. ఈనాడు నందనవనం : గతంలో ఈ ప్రాంతంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు, గర్భిణీలు, రోగులు భయపడిపోయేవారు. కంకర రాళ్లు తేలి, పెద్ద పెద్ద గుంతలతో రోడ్డు అధ్వాన్నంగా ఉండేది. ఆనాడు కంకర రాళ్లతో, గుంతల రోడ్ల వల్ల మా ప్రాణాలకు, మా నమ్ముకున్న ఆటోలకు అస్సలు రక్షణ లేకుండా పోయింది. నిత్యం ప్రమాదాల భయంతో బతికాం. కానీ ఈనాడు కూటమి ప్రభుత్వంలో గౌతు శిరీష గారి చొరవతో రోడ్డు అద్దంలా మారింది. ఇప్పుడు మా ప్రయాణం ప్రశాంతంగా, సురక్షితంగా సాగుతోంది అని ఉద్దానం ఆటోవాలాలు ఆనందం వ్యక్తం చేశారు.
హోరెత్తిన నినాదాలు: ఉద్దాన ఆడపడుచా.. నీకు మరువదు ఈ ఉద్దాన తల్లి. రహదారి నిర్మాణాన్ని పూర్తి చేసి తమ కష్టాలు తీర్చిన ఎమ్మెల్యే గౌతు శిరీషకు అభినందనలు తెలుపుతూ ఉద్దాన ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు.
“ఉద్దాన ఆడపడుచా.. నీ గుణం మరువదు ఈ ఉద్దాన తల్లి ! “ – ” అభివృద్ధి ప్రదాత గౌతు శిరీష గారి నాయకత్వం వర్ధిల్లాలి!” అని నినాదాలతో హోరెత్తించారు. ఈ డబుల్ తారు రోడ్డుతో వజ్రపుకొత్తూరు మండలంలోని పదుల సంఖ్యలో ఉన్న గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, ఉద్దాన ప్రాంత జీడి, కొబ్బరి పంటల రవాణాకు కూడా ఎంతో మేలు చేకూరనుంది. ఒక ఆడపడుచుగా ఉద్దాన ప్రజల కష్టాలను గుర్తించి, ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసిన శిరీష గారిపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
