రూ.80 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం.

రూ.80 లక్షల విలువ గల చోరీ సొత్తు స్వాధీనం

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు – పలు కేసుల ఛేదన

జిల్లా పోలీసుల చాకచక్యంతో వరుస దొంగతనాల కేసుల పరిష్కారం

జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపిఎస్

శ్రీకాకుళం, జూన్ 01. శ్రీకాకుళం జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఇటీవల జరిగిన వరుస దొంగతనాల కేసులను కాశీబుగ్గ పోలీసులు సమర్థవంతంగా ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి, వారి వద్ద నుండి భారీ మొత్తంలో చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

అరెస్టు కాబడిన నిందితులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మాల్దా జిల్లా, ఇంగ్లీష్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన గోయస్పూర్ గ్రామ నివాసులు.
A-1 : మహమ్మద్ మీజాన్ (36 సంవత్సరాలు)
A-2 : మహమ్మద్ హసన్ (26 సంవత్సరాలు).

దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, ప్రధాన నిందితుడు A-1 మహమ్మద్ మీజాన్ పగటి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి (రెక్కీ నిర్వహించి), రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడు. దొంగిలించిన బంగారం, నగదు మరియు ఇతర విలువైన వస్తువులను విక్రయించేవాడని విచారణలో వెల్లడైంది.
నిందితుడు A-1 మహమ్మద్ మీజాన్‌పై గతంలో శ్రీకాకుళం జిల్లాలో 7 కేసులు, విజయనగరం జిల్లాలో 7 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్ని కేసులలో కోర్టు శిక్ష విధించగా,జైలు శిక్ష కూడా అనుభవించాడు. అనంతరం 2025 అక్టోబర్ నెలలో జైలు నుండి విడుదలైన తర్వాత జిల్లాలో పోలీసుల నిఘా పటిష్టంగా ఉండటంతో ఒడిశా రాష్ట్రంలోని బరంపురంలో నివాసం ఉంటూ మళ్లీ నేర కార్యకలాపాలకు పాల్పడడం ప్రారంభించాడు.గత మూడు నుంచి నాలుగు నెలల కాలంలో A-1 మహమ్మద్ మీజాన్, A-2 మహమ్మద్ హసన్‌తో కలిసి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు దొంగతనాల కేసులు, టెక్కలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతన కేసుకు పాల్పడ్డారు. అదేవిధంగా మన్యం జిల్లా పార్వతీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసు, ఒడిశా రాష్ట్రం బరంపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కేసులో కూడా వీరి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించడం జరిగింది.

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ SHO గారికి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ బృందం పలాస మండలం గరుడఖండి గ్రామం జగనన్న కాలనీలో నిర్మాణంలో ఉన్న ఒక ఇంటిలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి కాశీబుగ్గ, టెక్కలి, పార్వతీపురం మరియు బరంపురం ప్రాంతాల్లో జరిగిన కేసులకు సంబంధించిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకుంది.
నిందితుల వద్ద నుండి 12 తులాల బంగారు ఆభరణాలు, 20 కిలోల వెండి ఆభరణాలు, రూ.1,09,350 నగదు మరియు సుమారు రూ.1 లక్ష విలువైన మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మొత్తం చోరీ సొత్తు విలువ సుమారు రూ.80 లక్షలు ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.

ఈ కేసుల ఛేదనలో కాశీబుగ్గ పోలీస్ సిబ్బంది అత్యంత చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేయడంలో విశేష ప్రతిభ కనబరిచారు.
ప్రతిభ కనబరిచిన అధికారులు మరియు సిబ్బంది.అదనపు ఎస్పీ (క్రైమ్)పి. శ్రీనివాసరావు, కాశీబుగ్గ డీఎస్పీ టి. భవాని పర్యవేక్షణలో వై. రామకృష్ణ – ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కాశీబుగ్గ PS,ఎన్. సునీల్ – సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కాశీబుగ్గ PS,టీ. భాస్కరరావు – హెడ్ కానిస్టేబుల్ 2001, కాశీబుగ్గ PS,ఎస్. ఉషాకిరణ్ – పోలీస్ కానిస్టేబుల్ 2058, కాశీబుగ్గ PS,ఎం. నీలకంఠం – పోలీస్ కానిస్టేబుల్ 2139, కాశీబుగ్గ PS,ఎస్. రాధాకృష్ణ – పోలీస్ కానిస్టేబుల్ 310, కాశీబుగ్గ PS,ఎల్. ఉమామహేశ్వరరావు – పోలీస్ కానిస్టేబుల్ 543, కాశీబుగ్గ PS,పీసీ అలీ – CCS PS

పై అధికారులు, సిబ్బంది కేసును ఛేదించి నిందితులను అరెస్టు చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించినందుకు జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు వారిని ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.